Monday, February 26, 2018

నీలకంఠ వైభవం - 19

8-238-వ.
అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ "దేవా! దేవర చిత్తంబు కొలంది నవధరింతురు గాక!" యని పలికె" నని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.


భావము:
ఇలా హాలాహలం మింగుతా అంటున్న తన భర్త అయిన భవునితో, ప్రియభార్య భవానీదేవి ఇలా అంటోంది. “స్వామీ! మీ మనస్సుకు తగినట్లు చేయండి.” ఇలా చెప్తున్న శుక మహర్షితో పరీక్షిన్మహారాజు ఇలా అడిగాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 18

8-236-క.
హరి మది నానందించిన
హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్
హరియును జగములు మెచ్చఁగ
గరళము వారించు టొప్పుఁ గమలదళాక్షీ!
8-237-క.
శిక్షింతు హాలహలమును
భక్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతుఁ బ్రాణి కోట్లను
వీక్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!

భావము:
ఓ మృగాక్షీ! ఉమాదేవీ! ఓ పద్మాక్షి! విష్ణుమూర్తిని తృప్తిపరిస్తే, లోకాలు అన్నీ తృప్తి చెందుతాయి. ఆ విష్ణుమూర్తీ, లోకాలూ సంతోషించేలా హాలాహల విషాన్ని అదుపు చేయడం మంచిపని. వికసించిన పద్మం వంటి మోము గల సతీదేవీ! హాలాహలాన్ని దండిస్తాను. చాలా చిన్న తియ్యని పండు రసంవలె హాలాహలాన్ని మింగుతాను. ఇవాళ ఈ జీవలోకం సమస్తాన్ని కాపాడతాను. నువ్వు చూస్తూ ఉండు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=237

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, February 25, 2018

నీలకంఠ వైభవం - 17

8-234-క.
ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన 
ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం
బ్రాణుల కిత్తురు సాధులు 
బ్రాణంబులు నిమిష భంగురము లని మగువా!
8-235-క.
పరహితము జేయు నెవ్వఁడు
పరమ హితుం డగును భూత పంచకమునకుం
బరహితమె పరమ ధర్మము
పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ!


భావము:
ఓ మగువా! పార్వతీ దేవి! ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించి పోయేవి. అందువలననే ఉత్తములు ప్రాణులకు తమ ప్రాణాలను అర్పించుటకు సైతం వెనుకాడరు. ఓ సౌందర్యరాశీ! పార్వతీదేవీ! ఇతరులకు సాయం చేసేవాడు, పంచభూతాలకూ పరమాప్తుడు అయి ఉంటాడు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. పరోకారికి ఎక్కడా తిరుగు లేదు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=234


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 16

8-232-వ.
అని మఱియు నభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులం గని సకల భూత సముండగు నద్దేవదేవుండుఁ దన ప్రియసతి కిట్లనియె.
8-233-క.
కంటే జగముల దుఃఖము; 
వింటే జలజనిత విషము వేఁడిమి; ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ!

భావము:
ఇలా తనను స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి, సర్వప్రాణులనూ సమానంగా ఆదరించే పరమ విభుడు, శంకరుడు తన అనుంగు భార్యతో ఇలా అన్నాడు.“ఓ లేడి కన్నుల సుందరీ! సతీదేవీ! చూడు లోకాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో. ఎంత తీవ్ర ప్రభావంతో ఉందో నీళ్ళలో పుట్టిన ఆ హాలాహల విషం. శక్తిసామర్థ్యాలుగల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి. దానివలన కీర్తి వస్తుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=233

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Saturday, February 24, 2018

నీలకంఠ వైభవం - 15

8-231-క.
నీకంటె నొండెఱుంగము; 
నీకంటెం బరులు గావ నేరరు జగముల్; 
నీకంటె నొడయఁ డెవ్వఁడు
లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!


భావము:
సమస్తలోకాల యందూ కీర్తింపబడు స్వామీ! శివా! నీవే మాకు దిక్కు. నిన్ను తప్ప మరెవ్వరినీ ఆశ్రయింపము. నీవు తప్ప మరెవ్వరూ లోకాలను కాపాడలేరు. నిన్ను మించిన గొప్పవాడు మరెవ్వరూ లేరు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=231


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 14

8-230-క.
లంపటము నివారింపను
సంపదఁ గృపజేయ జయము సంపాదింపం
జంపెడివారి వధింపను
సొంపారఁగ నీక చెల్లు సోమార్ధధరా!

భావము:
అర్థచంద్రుని అలంకారంగా ధరించిన మహా ప్రభూ! పరమేశ్వరా! ఈ ఆపదను తొలగించడానికి, ఆనందం చేకూర్చడానికీ, జయాన్ని సంపాదించడానికి, క్రూరులను హతమార్చడానికి నీవు మాత్రమే సమర్థుడవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=230

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, February 20, 2018

నీలకంఠ వైభవం - 13

8-229-మత్త.
బాహుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా
లాహలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో
లాహలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం
దోహమున్ బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా!

భావము:
ఓ పరమేశ్వరా! దేవతలూ రాక్షసులూ కలిసి భుజబలాలు వాడి పాల సముద్రాన్ని మథించారు. దానిలోనుంచి హాలాహలం అనే మహా విషం పుట్టింది. లోకాలను క్షోభ పెడుతోంది. అతలాకుతలం చేస్తోంది. ఎవరూ దానిని అడ్డుకోలేకుండా ఉన్నారు. అతిశయించిన దయ జాలువారగా ప్రాణికోటిని అనుగ్రహించు. ఆ హాలాహల విషాన్ని పరిగ్రహించు. 
'శివా! నీ దయ అతిశయించునట్లు, వికసించునట్లు ప్రకాశింప జేయవయ్యా అలా దయాసాగరా నీ దయ వర్షించకపోతే లోకాలు ఈ హాలాహల విషాగ్నికి కాగిపోతాయయ్యా.' ఇంతటి చిక్కనైన భావాన్ని 'దయదొంగలింపన్' (దయ + తొంగలింపగా) కాపాడవయా అనే భావ ప్రకటనతో అలవోకగా చెప్పిన పోతనామాత్యులకు ప్రణామములు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Sunday, February 18, 2018

నీలకంఠ వైభవం - 12

8-228-క.
సదసత్తత్త్వ చరాచర
సదనం బగు నిన్నుఁ బొగడ జలజభవాదుల్
పెదవులుఁ గదలుప వెఱతురు
వదలక నినుఁ బొగడ నెంతవారము రుద్రా!

భావము:
దేవా! శంకరా! సదసద్రూపమైన ఈ చరాచర జగత్తునకు మూలాధారం నీవు. బ్రహ్మాదులు సైతం నిన్ను ప్రస్తుతించడానికి భయపడి పెదవులు కదల్చలేరు. అంతటి నిన్ను స్తుతించడానికి మేము ఏమాత్రం సరిపోము కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=228

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

నీలకంఠ వైభవం - 11

8-227-ఆ.
మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు
మూఁడు కాలములకు మూల మగుచు
భేద మగుచుఁ దుది నభేదమై యొప్పారు 
బ్రహ్మ మనఁగ నీవ ఫాలనయన!


భావము:
నుదుట కన్ను గల ముక్కంటి! శంకరా! ముగ్గురు మూర్తులకూ, మూడులోకాలకూ, మూడు కాలాలకూ నీవే మూలం. మొదట భేదంతో కనిపించినా, చివరకి అభేద స్వరూపంతో ఒప్పారుతుండే పరబ్రహ్మవు నీవే.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Friday, February 16, 2018

నీలకంఠ వైభవం - 10

8-226-సీ.
తలఁపఁ బ్రాణేంద్రియ ద్రవ్యగుణస్వభా; 
వుఁడవు; కాలక్రతువులును నీవ; 
సత్యంబు ధర్మ మక్షరము ఋతంబును; 
నీవ ముఖ్యుండవు నిఖిలమునకు; 
ఛందోమయుండవు సత్త్వరజస్తమ; 
శ్చక్షుండవై యుందు; సర్వరూప
కామ పురాధ్వర కాలగరాది భూ; 
తద్రోహభయము చోద్యంబు గాదు;
8-226.1-తే.
లీలలోచనవహ్ని స్ఫులింగ శిఖల
నంతకాదులఁ గాల్చిన యట్టి నీకు
రాజఖండావతంస! పురాణ పురుష! 
దీన రక్షక! కరుణాత్మ! దేవ దేవ!

భావము:
చంద్ర కళను శిరసున ధరించు వాడా! పురాణ పురుషుడా! దీనులను రక్షించువాడా! దయామయా! దేవ దేవ! తరచి చూస్తే ప్రాణమూ, ఇంద్రియాలూ, ద్రవ్యమూ, గుణాలూ సర్వం నీ స్వభావసిద్ధాలు. కాలమూ యజ్ఞమూ నీవే; సత్యమూ, ధర్మమూ, ఓంకారమూ, మోక్షమూ నీవే; అన్నింటికి నీవే ఆధారం; వేదరూపుడవు నీవే; సత్త్వము, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలూ నీవు నేత్రాలుగా కలిగి ఉంటావు; సమస్తమైన రూపాలు నీవే; లీలగా చూసే నీ మూడోకన్ను చూపుల మంటలతో యమాదులను సైతం భస్మం చేస్తావు; మన్మథుడు, త్రిపురాసురులు, దక్షయజ్ఞం, కాలకూటవిషం మున్నగు సర్వ భాతాల వలన నీకు హాని కలుగుతుంది అని సంకోచం అన్నది లేకపోవటంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=226

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

నీలకంఠ వైభవం - 9

8-225-క.
కొందఱు గలఁ డందురు నినుఁ; 
గొందఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం
గొందఱు; గలఁ డని లేఁ డని
కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా!

భావము:
ఓ పరమేశ్వరా! మహాప్రభూ! కొందరు నీవు ఉన్నావు అంటారు. కొందరు నీవు లేవు అంటారు. ఇంకా కొందరు నీవు సగుణరూపుడవు అంటారు. మరికొందరు నీవు ఉన్నావో లేవో అనే సందేహాలతో కొట్టుమిట్టాడుతుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=225

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Sunday, February 11, 2018

నీలకంఠ వైభవం - 8

8-224-సీ.
అగ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ; 
కాలంబు గతి; రత్నగర్భ పదము; 
శ్వసనంబు నీ యూర్పు; రసన జలేశుండు; 
దిశలుఁ గర్ణంబులు; దివము నాభి; 
సూర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు; 
జఠరంబు జలధులు; చదలు శిరము; 
సర్వౌషధులు రోమచయములు; శల్యంబు; 
లద్రులు; మానస మమృతకరుఁడు;
8-224.1-తే.
ఛందములు ధాతువులు; ధర్మసమితి హృదయ; 
మాస్య పంచక ముపనిష దాహ్వయంబు; 
నయిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య
మై స్వయంజ్యోతి యై యొప్పునాద్య మగుచు.

భావము:
అగ్ని నీ ముఖము; జీవాత్మ పరమాత్మ నీవే అయి ఉంటావు; కాలం నీ నడక; భూమండలం నీ పాదం; వాయువు నీ శ్వాస; వరుణుడు నా నాలుక; దిక్కులు నీ చెవులు; స్వర్గం నీ నాభి; సూర్యుడు నీ దృష్టి; నీరు నీ వీర్యం; సముద్రాలు నీ గర్భం; ఆకాశం నీ శిరస్సు; ఓషదులు నీ రోమ సమూహాలు; పర్వతాలు నీ ఎముకలగూడు; చంద్రుడు నీ మనస్సు; వేదాలు నీ ధాతువు; ధర్మశాస్త్రాలు నీ హృదయం; ఉపనిషత్తులు నీ ముఖాలు; నీ రూపం పరతత్వం; నీవు స్వయంప్రకాశుడవు; శివ అనే నామం కలిగిన పరంజ్యోతివి నీవు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=224

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

నీలకంఠ వైభవం - 7

8-223-క.
నీ యంద సంభవించును
నీ యంద వసించి యుండు నిఖిల జగములున్
నీ యంద లయముఁ బొందును
నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా!

భావము:
రుద్రదేవా! అన్నిలోకాలు నీలోనే పుడతాయి; నీలోనే నివసిస్తాయి; ప్రాణులు అన్ని నీలోనే లయమవుతాయి; నీ ఉదరం ప్రాణులు అన్నిటికి అలవాలం

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=223

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, February 9, 2018

నీలకంఠ వైభవం - 6

8-222-సీ.
భూతాత్మ! భూతేశ! భూత భావనరూప! ;
దేవ! మహాదేవ! దేవవంద్య! 
యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ; 
బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; 
యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ; 
గోరి భజింతురు కుశలమతులు; 
సకల సృష్టిస్థితిసంహారకర్తవై; 
బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవ;
8-222.1-ఆ.
పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త
మంబు నీవ శక్తిమయుఁడ వీవ; 
శబ్దయోని వీవ; జగదంతరాత్మవు
నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు

భావము:
“ఓ పరమేశ్వరా! పంచ భూతాలకూ ఆత్మ అయిన వాడా! సర్వ భూతాలకూ అధినాథా! జీవులకు కారణమైన రూపమైన దేవా! ఓ దైవమా! మహాదేవా! దేవతలకు వందనీయుడా! ఈ లోకాలు అన్నిటికి ప్రభువు నీవే; సంసారబంధాలలో పడుట, మోక్షమూ ఏది అనుగ్రహించాలన్నా నీవల్లనే సాధ్యం అవుతుంది; జ్ఞానులు ఆర్తులకు శరణు ఇచ్చేవాడూ, ఆదిగురువు అయిన నిన్ను కోరి ప్రార్థిస్తారు; సృష్టి, స్థితి, సంహార కార్యాలు సమస్తమునకు కారణ భూతుడవు అయి; బ్రహ్మ విష్ణు శివ పేర్లుతో విరాజిల్లుతుంటావు; భావానికి అందని పరబ్రహ్మవు; సదసద్రూప పరమాత్మవూ నీవే; శక్తి యుక్తుడవు నీవే; శబ్దానికి జన్మస్థానం అయిన శబ్దబ్రహ్మము నీవే; లోకానికి అంతరాత్మవు నీవే; సర్వ చరాచరాలకు ప్రాణము నీవే;



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 5

8-220-క.
వారలు దీనత వచ్చుటఁ
గూరిమితో నెఱిఁగి దక్షుకూఁతురుఁ దానుం
బేరోలగమున నుండి ద
యారతుఁడై చంద్రచూడుఁ డవసర మిచ్చెన్.
8-221-వ.
అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతించిరి.

భావము:
అలా దేవతలు దుఃఖంతో వచ్చుటను దయామయుడైన చంద్రరేఖను భూషణంగా ధరించే శంకరుడు చూసాడు. అప్పుడు సతీదేవితో కలిసి పేరోలగంలో ఉన్న శివుడు దేవతలకు దర్శనం ఇచ్చి ఆదరంగా చెప్పుకోండి మీ విన్నపం అన్నాడు. అలా అవసరమిచ్చిన సర్పాలంకార భూషితుడైన శంకరునకు, బ్రహ్మ మొదలైన దేవతలు అందరూ సాగిలపడి నమస్కారాలు చేసి ఇలా ప్రార్థించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=220

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Tuesday, February 6, 2018

నీలకంఠ వైభవం - 4

8-219-మ.
చని కైలాసముఁ జొచ్చి శంకరుని వాసద్వారముం జేరి యీ
శుని దౌవారికు లడ్డపడ్డఁ దల మంచుం జొచ్చి కుయ్యో మొఱో
విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు మం చంబుజా
సనముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్.


భావము:
ఆ సమయంలో బ్రహ్మాది దేవతా ప్రముఖులు అందరూ ఆర్తితో ఆశ్రయించిన వారిని కాపాడే వాడూ, సుఖప్రదాతా అయిన శంకరుని వేడుటకు కైలాసానికి వెళ్ళారు. పరమశివుని మందిరం ద్వారపాలకులు అడ్డుకున్నారు. కానీ వారిని తప్పుకోమని లోనికి ప్రవేశించి ఈశ్వరుని దర్శనం చేసుకుని “శరణు, శరణు చిత్తగించు దయతో చూడు, కాపాడు” అంటూ మొరపెట్టుకున్నారు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




నీలకంఠ వైభవం - 3

8-217-క.
ఒడ్డారించి విషంబున
కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్
గొడ్డేఱి మ్రంది రా లన
బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా!
8-218-వ.
అప్పుడు


భావము:
ఓ రాజా! అప్పుడు ఆ విషాగ్నిని అడ్డగించే సాహసం చేసి కాపాడే మహనీయులు లేకపోయారు. పెళ్ళం పిల్లలు అనే మమకారం లేకుండా పారిపోయికూడా జనులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా హాలహలం వ్యాపిస్తున్న సమయంలో. . . .



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Monday, February 5, 2018

నీలకంఠ వైభవం - 2

8-216-వ.
అదియునుం బ్రళయకాలాభీల ఫాలలోచన లోచనానలశతంబు చందంబున నమందంబై; విలయ దహన సహస్రంబు కైవడి వడియై; కడపటి పట్టపగలింటి వెలుంగుల లక్ష తెఱంగున దుర్లక్షితంబై; తుదిరేయి వెలింగిన మొగిలుగముల వలనం బడు బలు పిడుగుల వడువున బెడిదంబై; పంచభూతంబులుం దేజోరూపంబులైన చాడ్పున దుస్సహంబై; భుగభుగాయమానంబులైన పొగలును; జిటచిటాయమానంబులైన విస్ఫులింగంబులును; ధగధగాయమానంబు లైన నెఱమంటలును; గలిగి మహార్ణవ మధ్యంబున మందరనగం బమంథరంబుగం దిరుగునెడ జనియించి పటపటాయమానంబై నింగికిం బొంగి దిశలకుం గేలు చాఁచి బయళ్ళు ప్రబ్బికొని తరిగవ్వంపుఁ గొండ నండ గొనక; నిగిడి కడలి నలుగడలకుం బఱచి; దరుల కుఱికి; సురాసుర సముదయంబులం దరిగొని; గిరివర గుహాగహ్వరంబుల సుడిపడక కులశిఖరి శిఖరంబుల నెరగలివడి; గహనంబుల దహించి కుంజమంజరీ పుంజంబుల భస్మంబుజేసి; జనపదంబు లేర్చి; నదీ నదంబు లెరియించి; దిక్కుంభి కుంభంబులు నిక్కలుపడ నిక్కి; తరణి తారామండలంబులపై మిట్టించి; మహర్లోకంబు దరికొని; యుపరిలోకంబునకు మాఱుగొనలిడి సుడిపడి ముసురుకొని; బ్రహ్మాండ గోళంబు చిటిలి పడన్ దాఁటి; పాతాళాది లోకంబులకు వేళ్ళుబాఱి; సర్వలోకాధికంబై శక్యంబుగాక యెక్కడఁ జూచినం దానయై; కురంగంబు క్రియం గ్రేళ్ళుఱుకుచు; భుజంగంబు విధంబున నొడియుచు; సింగంబు భంగి లంఘించుచు; విహంగంబు పగిది నెగయుచు; మాతంగంబు పోలికి నిలువంబడుచు నిట్లు హాలాహల దహనంబు జగంబులం గోలాహలంబు చేయుచున్న సమయంబున; మెలకు సెగల మిడుకం జాలక నీఱైన దేవతలును; నేలంగూలిన రక్కసులును; డుల్లిన తారకలును; గీటడంగిన కిన్నర మిథునంబులును; గమరిన గంధర్వవిమానంబులును; జీకాకుపడిన సిద్ధచయంబులును; జిక్కుపడిన గ్రహంబులును జిందఱవందఱ లయిన వర్ణాశ్రమంబులును; నిగిరిపోయిన నదులును; నింకిన సముద్రంబులును; గాలిన కాననంబులును బొగిలిన పురంబులును; బొనుఁగుపడిన పురుషులును; బొక్కిపడిన పుణ్యాంగనా జనంబులును; బగిలిపడిన పర్వతంబులును భస్మంబులైన ప్రాణి సంఘంబులును; వేఁగిన లోకంబులును; వివశలైన దిశలును; నొడ్డగెడవులైన భూజచయంబులును; నఱవఱలైన భూములునునై యకాల విలయకాలంబై తోచుచున్న సమయంబున.

భావము:

మంథర పర్వతంతో చిలికిన చిలుకుడుకు పాలసముద్రంలో పుట్టిన హాలాహలం, ప్రళయకాలంలో, పరమేశ్వరుని నుదటి కన్ను నుండి వెలువడే మహా భయంకరమైన అగ్నిజ్వాలలకంటె నూరురెట్లు చురుకైనది; కల్పాంతకాలపు అగ్నికంటె వెయ్యిరెట్లు తీవ్రమైనది; మహాప్రళయకాలపు లక్ష సూర్యుల తేజస్సువలె తేరిచూడరానిది; ప్రళయకాలపు కాళరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగులవలె మహా భీకరమైనది; భగ భగ మండే పంచభూతాలవలె భరింపలేనిది. భుగ భుగ మనే పొగలతో, చిటపటమనే నిప్పుకణాలతో, ధగ ధగ మని మెరిసే పెనుమంటలతో, ఫట ఫట మంటూ ఆ మాహా విషం ఆకాశం అంత ఎత్తు పొంగుతోంది; దిక్కులంతా వ్యాపిస్తోంది; బయళ్ళన్నీ నిండిపోతోంది; మంథర పర్వతాన్ని దాటి సముద్రంలో నలువైపులా వ్యాపిస్తోంది; చెలియలికట్టలు గట్లు దాటేస్తోంది;. దేవదానవుల గుంపులను దాటిపోతోంది; కొండగుహలలో తొట్రుపడకుండా ఎత్తైన పర్వతశిఖరాలలో నిప్పులు నింపేస్తోంది; అడవులను కాల్చేస్తోంది; పొదరిళ్ళలో పూలగుత్తులను మాడ్చేస్తోంది. గ్రామాలను కాల్చేస్తోంది; నదీనదాలను ఎండగట్టేస్తోంది; దిగ్గజాల కుంభస్థలాలపైకి ప్రాకేస్తోంది; సూర్యగోళాన్నీ నక్షత్రాలనూ అణగద్రొక్కేస్తోంది; మహర్లోకాన్ని మసిచేస్తోంది; ఊర్థ్వ లోకాలకు కీడు కలిగేటట్లు పెరగిపోతోంది; చుట్టు ముట్టి క్రమ్ముకొని బ్రహ్మాండం బద్ధలయిపోయేలా విస్తరిస్తోంది; పాతాళ లోకం దాకా వ్రేళ్ళూనుతోంది. ఆ హాలాహలం ఎటుచూస్తే అటుప్రక్క అసాధరణంగా అన్నిలోకాలలోనూ కూరుకుపోతోంది; జింకవలె గంతులు వేస్తోంది; సింహాంవలె దూకుతోంది; పక్షిలా ఎగురుతోంది; ఏనుగులా స్థిరంగా నిలబడిపోతోంది; లోకాలన్నిటా గగ్గోలు పెట్టిస్తోంది. ఆ పెను మంటల వేడికి తట్టుకోలేక దేవతలు కొందరు భస్మం అయ్యారు; రాక్షసులు నేలకూలారు; చుక్కలు రాలాయి; కిన్నర దంపతులు నశించారు; గంధర్వుల విమానాలు కాలిపోయాయి; సిద్ధుల గుంపులు చెదిరి పోయాయి; గ్రహాలు సంకటపడ్డాయి; నదులు ఎండిపోయాయి; సముద్రాలు ఇంకిపోయాయి; అడవులు మాడిపోయాయి; పట్టణాలు బావురుమన్నాయి; పురుషులు వెతల పాలయ్యారు; పుణ్యస్త్రీలు పొగిలిపోయారు; పర్వతాలు బ్రద్దలైపోయాయి; జీవరాసులు అడుగంటిపోయాయి; లోకాలు తపించి పోయాయి; దిక్కులు కలత చెందాయి; చెట్లు తలక్రిందులు అయ్యాయి; నేలలు బదాబదలు అయ్యాయి; అకాలంలో ప్రళయం వచ్చినట్లు అయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=216

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

నీలకంఠ వైభవం - 1

8-215-క.
ఆలోల జలధి లోపల
నాలో నహి విడిచి సురలు నసురులుఁ బఱవం
గీలా కోలాహలమై
హాలాహల విషము పుట్టె నవనీనాథా!


భావము:
పరీక్షిన్మహారాజా! అల్లకల్లోలమైన పాలకడలిలో నుండి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన “హాలాహలము” అనే మహావిషము పుట్టింది. అది చూసి భయంతో దేవతలూ, రాక్షసులూ పట్టుకున్న నాగరాజు వాసుకిని వదలిపెట్టి పారిపోసాగారు.
లకార ప్రాసతో హాలాహల, కోలహలాలకు జత కట్టించిన బమ్మెరవారి పద్యం మధురాతి మధురం.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=215


:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




Sunday, February 4, 2018

ద్వారక అస్తమయం - 28:

11-123-క.
ఈ కథ విన్నను వ్రాసిన 
బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం
జేకొని యాయువు ఘనుఁడై
లోకములో నుండు నరుఁడు లోకులు వొగడన్‌.
11-124-చ.
నగుమొగమున్‌ సుమధ్యమును నల్లని మేనును లచ్చికాటప
ట్టగు నురమున్‌ మహాభుజము లంచితకుండలకర్ణముల్‌ మదే
భగతియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
మ్ముగఁబొడసూపుఁగాతఁ గనుమూసినయప్పుడు విచ్చినప్పుడున్‌.

భావము:
ఈ కథను విన్నవారు, వ్రాసినవారు సిరిసంపదలు కీర్తి అదృష్టము కలిగి దీర్ఘాయువుతో లోకులు మెచ్చే గొప్పవారై ప్రకాశిస్తారు. నవ్వు ముఖము; చక్కని నడుము; నల్లని దేహము; లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము; పెద్ద బాహువులు; అందమైన కుండలాలు కల చెవులు; గజగమనము; నల్లనిజుట్టు; దయారసం చిందే చూపు కలిగిన విష్ణుమూర్తి నేను కనులు మూసినపుడు తెరచినపుడు పొడచూపు గాక.

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&padyam=124

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

Friday, February 2, 2018

ద్వారక అస్తమయం - 27

11-122-వ.
అనుచు నా దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె; “యాదవసముద్రం బడంగె; బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడం బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?” నని పలుకునవసరంబున దివ్యాయుధంబులును, దివ్య రథరథ్యంబులు నంతర్ధానంబు నొందె; నారాయణుండు వానితో“ నక్రూరవిదురులకు నీవృత్తాంతం బంతయుఁ జెప్పుము; సవ్యసాచిం గని స్త్రీ బాల గురు వృద్ధ జనంబులఁ గరిపురంబునకుం గొనిచను మనుము; పొ” మ్మనిన వాఁడును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ జెప్పె; నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె; నంత నెవ్వరికిం జనరాకయుండె నప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును, బ్రహ్మరుద్రాదిదేవతలును, జయజయశబ్దంబులతోడం గదలిరా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై యుండె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె" నని చెప్పి.


భావము:
అంటూ దారుకుడు మిక్కిలి దుఃఖంతో ఇలా విన్నవించాడు. “సముద్రమంత యాదవ సమూహం నశించింది. బంధువులు, గురువులు, మిత్రులు అందరు అటు ఇటూ చెల్లాచెదురైపోయారు. ద్వారకకు పోయి మిత్రులతో ఏమని చెప్పాలి.” అని అంటూండగానే, శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలు, గుఱ్ఱాలూ మాయమైపోయాయి. శ్రీకృష్ణుడు దారుకుడితో, “అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. స్త్రీలను, పిల్లలను, పెద్దవారిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళమని అర్జునుడితో చెప్పు. వెళ్ళు.” అన్నాడు. దారుకుడు తిరిగివెళ్ళి కృష్ణుడి మాటలు వివరంగా అందరికీ చెప్పాడు. ఆయన చెప్పినట్లు చేసేటంతలో ద్వారకానగరం పూర్తిగా జలాలలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించటానికి వీలులేని స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో వెడలి నారదుడు మున్నగు మునులు, బ్రహ్మదేవుడు, రుద్రుడు, మొదలయిన దేవతలు జయజయ నినాదాలతో వెంట రాగా తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ నారాయణుని విగ్రహము సముద్ర ప్రాంతంలో జగన్నాథుడి రూపంతో ఉంది.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుకి చెప్పాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::