Monday, November 27, 2017

పోతన రామాయణం - 47

9-347-వ.
అంత; సీతయు గర్భిణి గావునఁ గుశలవు లనియెడి కొడుకులం గనియె; వారికి వాల్మీకి జాతకర్మంబు లొనరించె లక్ష్మణునకు నంగ దుండును, జంద్రకేతుండును భరతునకుఁ దక్షుండును, బుష్కలుం డును శత్రుఘ్నునకు సుబాహుండును, శ్రుతసేనుండును సంభ వించిరి; అయ్యెడ.
9-348-క.
బంధురబలుఁడగు భరతుఁడు
గంధర్వచయంబుఁ ద్రుంచి కనకాదుల స
ద్బంధుఁ డగు నన్న కిచ్చెను
బంధువులును మాతృజనులుఁ బ్రజలున్ మెచ్చన్.


భావము:
అంతట, అప్పటికే కడుపుతో ఉన్న సీతాదేవి కుశలవులను అను పుత్రులను కన్నది. వారికి వాల్మీకి జాతకర్మలు చేసాడు. లక్ష్మణునకు అంగదుడు, చంద్రకేతుడు; భరతునకు దక్షుడు, పుష్కలుడు; శత్రుఘ్నునికి సుబాహుడు, శ్రుతసేనుడు అని ఇద్దరేసి కొడుకులు పుట్టారు. అప్పుడు. బలశాలి అయిన భరతుడు బంధువులు, తల్లులు, లోకులు మెచ్చేలా, గంధర్వులను సంహరించి ధనాన్ని, బంగారాన్ని తీసుకువచ్చి సజ్జనబంధువైన సోదరుడు శ్రీరాముడికి ఇచ్చాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments: