Wednesday, July 26, 2017

దక్ష యాగము - 99


4-211-వ.
అంత దాక్షాయణి యయిన సతీదేవి పూర్వకళేబరంబు విడిచి హిమవంతునకు మేనక యందు జనియించి విలయకాలంబునం బ్రసుప్తం బయిన శక్తి సృష్టికాలంబున నీశ్వరునిఁ బొందు చందంబునఁ బూర్వదయితుండగు రుద్రుని వరించె నని దక్షాధ్వర ధ్వంసకుం డగు రుద్రుని చరిత్రంబు బృహస్పతి శిష్యుండైన యుద్ధవునకు నెఱింగించె; అతండు నాకుం జెప్పె; నేను నీకుం జెప్పితి;" అని మైత్రేయుండు వెండియు విదురున కిట్లనియె.
4-212-క.
"ఈ యాఖ్యానముఁ జదివిన
ధీయుతులకు వినినయట్టి ధీరుల కైశ్వ
ర్యాయుః కీర్తులు గలుగును; 
బాయును దురితములు; దొలఁగు భవబంధంబుల్."

టీకా:
అంత = అంతట; దాక్షాయణి = దక్షుని పుత్రిక; అయిన = అయిన; సతీదేవి = సతీదేవి; పూర్వ = పాత; కళేబరంబున్ = శరీరమును; విడిచి = వదలి; హిమవంతునకు = హిమవంతునకు; మేనక = మేనక; అందున్ = అందు; జనియించి = పుట్టి; విలయ = ప్రళయ; కాలంబునన్ = సమయమునందు; ప్రసుప్తంబు = బాగనిద్రించినది; అయిన = అయిన; శక్తి = శక్తి; సృష్టికాలంబునన్ = సృష్టికాలమున; ఈశ్వరుని = శివుని; పొందు = చెందు; చందంబునన్ = విధముగ; పూర్వ = పూర్వపు; దయితుండు = ప్రియుడు; అగు = అయిన; రుద్రుని = శివుని; వరించెన్ = వరించెను; అని = అని; దక్ష = దక్షుని; అధ్వర = యాగమును; ధ్వంసకుడు = ధ్వంసము చేసినవాడు; అగు = అయిన; రుద్రుని = శివుని; చరితంబున్ = వర్తనమును; బృహస్పతి = బృహస్పతి; శిష్యుండు = శిష్యుడు; ఐన = అయిన; ఉద్ధవున్ = ఉద్ధవుని; కున్ = కి; ఎఱింగించె = తెలిపెను; అతండు = అతడు; నాకున్ = నాకు; చెప్పెన్ = చెప్పెను; నేను = నేను; నీకున్ = నీకు; చెప్పితిన్ = చెప్పాను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; వెండియున్ = మరల; విదురున్ = విదురున; కున్ = కు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను. ఈ = ఈ; ఆఖ్యానమున్ = కథను; చదివిన = చదివిన; ధీ = బుద్ధిబలముతో; యుతులకు = కూడినవారికి; వినిన = విన్న; అట్టి = అటువంటి; ధీరుల్ = బుద్ధిబలముకలవారి; కిన్ = కి; ఐశ్వర్య = ఐశ్వర్యము; ఆయుస్ = జీవితకాలము; కీర్తిలున్ = కీర్తి; కలుగును = కలుగును; పాయును = దూరమగును; = దురితములున్ = పాపములు; తొలగున్ = తొలగిపోవును; భవబంధంబుల్ = సంసారబంధములు.

భావము:
ఆ తరువాత దక్షుని కూతురైన సతీదేవి పూర్వ శరీరాన్ని విడిచి, హిమవంతునకు, మేనకకు కుమార్తెగా జన్మించి, ప్రళయకాలంలో ప్రస్తుప్తమైన శక్తి సృష్టికాలంలో ఈశ్వరుని పొందిన విధంగా తన పూర్వభర్త అయిన రుద్రుని వరించింది” అని దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన రుద్రుని చరిత్రను బృహస్పతి తన శిష్యుడైన ఉద్ధవునకు చెప్పాడు. ఆ ఉద్ధవుడు నాకు చెప్పాడు. నేను నీకు చెప్పాను” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు. “ఈ కథను చదివిన బుద్ధిమంతులకు, విన్న ధీరులకు ఐశ్వర్యం, ఆయువు, కీర్తి లభిస్తాయి. పాపాలు, భవబంధాలు తొలగిపోతాయి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=212

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

*****************************
నేటితో దక్షయాగము ఘట్టం సమాప్తం... ఈ పోస్టులను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు... నమః శివాయ.... జై శ్రీ రామ....
*****************************

No comments: