Tuesday, November 22, 2016

వామన వైభవం - 32:

8-516-క.
"పురు డీ బోటికి నిందిర
పురు డంబిక గాక యొరులు పురుడే?" యనుచున్
బురుటాలికిఁ బది దినములు
పురుడు ప్రవర్తించి రెలమిఁ బుణ్యపు గరితల్.
8-517-వ.
అంత నబ్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యపప్రజాపతిం బురస్కరించుకొని సముచితోపనయనకర్మ కలాపంబులు చేయించిరి; సవిత సావిత్రి నుపదేశించె, బృహస్పతి యజ్ఞోపవీతధారణంబునుఁ, గశ్యపుండు ముంజియుఁ, గౌపీనం బదితియు, ధరణి కృష్ణాజినంబును, దండంబు వనస్పతి యగు సోముండును, గగనాధిష్ఠానదేవత ఛత్రంబునుఁ, గమండలువు బ్రహ్మయు, సరస్వతి యక్షమాలికయు, సప్తర్షులు కుశపవిత్రంబులు నిచ్చిరి; మఱియును.

టీకా:
పురుడు = సమానురాలు, సాటి; ఈ = ఈ; బోటి = ఇల్లాలు; కిన్ = కి; ఇందిర = లక్ష్మీదేవి; పురుడు = సమానురాలు, సాటి; అంబిక = పార్వతీదేవి; కాక = అంతే తప్పించి; ఒరులు = ఇతరులు; పురుడే = సమానులా, సాటికాగలరా; అనుచున్ = అనుచు; పురటాలి = బాలంతరాలి; కిన్ = కి; పది = పది (10); దినములు = రోజులు; పురుడు = పురుటిశుద్ధి; ప్రవర్తించిరి = నడిపించిరి; ఎలమిన్ = అతిశయించి; పుణ్యపుగరితల్ = ముత్తైదువలు.
                       అంతన్ = అంతట; ఆ = ఆ; బాలున్ = పిల్లవాని; కున్ = కి; సంతసంబునన్ = సంతోషముతో; మహర్షులు = మునీంద్రులు; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతిన్ = బ్రహ్మను; పురస్కరించుకొని = ముందుంచుకొని; సముచిత = తగినవిధముగ; ఉపనయన = వడుగు; కర్మకలాపంబులు = కార్యక్రమములు; చేయించిరి = జరిపించిరి; సవిత = సూర్యుడు; సావిత్రిన్ = గాయత్రీమంత్రమును; ఉపదేశించెన్ = ఉపదేశించెను {ఉపదేశము - అధికారదత్తపూర్వకముగ నేర్పుట}; బృహస్పతి = బృహస్పతి; యజ్ఞోపవీత = జంధ్యమును; ధారణంబును = ధరింపజేయుట; కశ్యపుండు = కశ్యపుడు; ముంజియున్ = ముంజిదర్భలు; కౌపీనంబున్ = గోచీని; అదితి = అదితి; ధరణి = భూదేవి; కృష్ణాజినంబును = నల్లజింకచర్మమును; దండంబు = దండమును; వనస్పతి = అడవికి అధిష్ఠానదేవత; అగు = అయిన; సోముండును = సోముడు; గగన = ఆకాశమునకు; అధిష్ఠానదేవత = అధికారి; ఛత్రంబును = గొడుగు; కమండలువున్ = కమండలమును; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; సరస్వతి = సరస్వతీదేవి; అక్షమాలిక = జపమాల; సప్తర్షులు = సప్తర్షులు; కుశపవిత్రంబులు = పవిత్రమైనదర్భలు; ఇచ్చిరి = ఇచ్చిరి; మఱియున్ = ఇంకను.

భావము:
“ఈ ఇల్లాలికి లక్ష్మి పార్వతులే సమానమైన వారు. ఇతరులు సమానులు కాదు.” అంటూ పెద్ద ముత్తైదువలు బాలెంతరాలైన అదితికి పది రోజులు పురుడు నడిపినారు.
                    అటు పిమ్మట, వామనుడికి వడుగు చేయడం కోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్నీ; కశ్యపుడు ముంజ, దర్భల మొలత్రాడునూ; అదితి కౌపీనాన్నీ; భూదేవి నల్లని జింకచర్మాన్నీ; చంద్రుడు దండాన్నీ; ఆకాశం గొడుగునూ; బ్రహ్మ కమండలాన్ని; సరస్వతీదేవి జపమాలనూ; సప్తఋషులు పవిత్రమైన దర్భలనూ ఇచ్చారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=516

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: