Saturday, April 15, 2017

దక్షయాగము - 3:

4-37-క.
అని యడిగిన నవ్విదురునిఁ
గనుఁగొని మైత్రేయుఁ డనియెఁ గౌతుక మొప్పన్
"విను మనఘ! తొల్లి బ్రహ్మలు
జన నుతముగఁ జేయునట్టి సత్రముఁ జూడన్.
4-38-చ.
సరసిజగర్భ యోగిజన శర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు
క్పరమ ఋషిప్రజాపతులు భక్తిఁ మెయిం జనుదెంచి యుండ న
త్తరణిసమాన తేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సదస్యు లా
దరమున లేచి; రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్.

భావము:
అని అడిగిన విదురునకు మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు. “పుణ్యాత్మా! విను. పూర్వం బ్రహ్మవేత్తలు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని చూడటానికి. శివుడు, బ్రహ్మ, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైన వారంతా పరమాసక్తితో వచ్చారు. అప్పుడు అక్కడికి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తూ దక్షుడుకూడ వచ్చాడు. దక్షుని చూడగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోని వారందరూ లేచి నిలబడ్డారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=38


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: